Motivational Story:02

#రియల్_స్టోరీ


    మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో.. ఒక చిన్న కుగ్రామం. 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది.

    ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఆ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలాయి. కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి వారిరువు శ్రమిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో భర్త అనారోగ్యం పాలయ్యాడు.

     స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. పెద్దాసుపత్రి అంటే డబ్బులు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి. లతమ్మకి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకువెళ్లింది. రెండు రోజులు అక్కడే ఉంచింది. భర్త నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ అసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లోని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.

     లతమ్మకి దుఖం ఒక్కటే మిగిలింది. తన దౌర్భాగ్యానికి బాధ పడింది. భర్త పరిస్థితి పూట., పూటకి దిగజారి పోతూవుంది. తన భర్త తన చేతుల్లో చనిపోవటం.. అనే ఆలోచన ఆమెని కుదిపేసింది. నిస్సాహాయంగా రోదించింది.. మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ.. ఇది సమయం కాదని ఆమె గ్రహించింది. వెంటనే చుట్టు పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయంతో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.

 అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు. 
వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్పవద్దని.. కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది? ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి. మరి కొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కానీ.. జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన మాంగల్యం తన కళ్ల ముందే దూరం అవుతుందని ఏడ్చింది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదైన పరీక్షలు అంటూ.. రోధిస్తుంది. ఆమె కన్నీళ్లు..  ఆమె మాట వినడం లేదు. బోరున ఏడువ సాగింది.
ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుండిపోయారు.

 భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి..  రెండు సమోసాలు తీసుకొచ్చి.. భర్తకి ఇచ్చింది. నేను తిన్నాను.. నువ్వు తినేయ్ అంది. సమోసా చుట్టిన కాగితం పారవేస్తూ.. మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . “బారామతి మారథాన్ గెలవండి. 3000 వేలు నగదు పొందండి. అనే ప్రకటన చదివింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు.. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమతమయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.

    19-12-2013న బారామతి మారథాన్  మొదలవబోతూ ఉంది. పోటీదారులందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు. 
    9 గజాల నేత చీర కట్టుకుని.. కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా.. తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పోల్గొనటానికి అనుమతి అడిగింది. అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ.. ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది. ప్రాదేయపడింది. బ్రతిమాలింది. 

    చివరికి బరిలో దిగింది. పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.. ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని.. కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ.. ఎర్రటి ఎండ కానీ.. తెలియలేదు. తనకు తెలిసిందల్లా.. గెలవాలి మూడు వేలు తీసుకోవాలి భర్తకి టెస్టులు చేయించాలి.. సరైన వైద్యం చేయించాలి. తన భర్త బతకాలి.. తనకి జీవితాంతం తోడు ఉండాలి.. అదే లక్షం.. అదే వేగం.. అదే పరుగు.. అదే విజయం. బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం. 
ప్రజలు చప్పట్లు మధ్య ఆమె మారథాన్ నెగ్గింది.

    నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీ ని రూ.5 వేలుగా చేసి అందించారు. ఆ డబ్బుతో ఆమె ఆసుపత్రికి పరిగెట్టింది.

    ఆమె ప్రేమ ఊరికేపోలేదు. ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్న బోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్నీ పత్రికలు, ఛానల్స్  లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.. చూపించాయి. దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి. నెల తిరిగే సరికి ఆమె జీవితం మారిపోయింది. 

ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి. ఆ కుటుంబం అన్నీ విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' ఎందరికో ఆదర్శమయ్యింది....