Moral Story - 02

 లక్ష్య  శుద్ధి

    పూర్వం ప్రజ్ఞాపురం లో కుందముడు అనే పదేళ్ళ కుర్రాడు వుండేవాడు.వాడి తల్లి జబ్బుతో మరణించింది.తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.పిన్ని వచ్చింది.ఆవిడకు కుందముడంటే యిష్టముండేది కాదు.వాడిని ఎలాగైనా యింటినుండి గెంటేస్తే తనూ మొగుడూ చిలకాగోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్లి పూజారి చెప్తున్నహరికథ విన్నాడు. అందులో ఒక కుర్రాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన వరాలన్నీ యిచ్చేశాడని పూజారిగారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. యింటికి వచ్చి పిన్నిని అడిగాడు. పూజారిగారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలిస్తారని నిజమేనా?అని అడిగాడు. ఆవిడకు వీడిని ఎలాగైనా వదిలించుకోవాలని వుంది కదా! అందుకని నిజమే వూరికి ఉత్తరాన వున్న చింత చెట్టు క్రింద కూచుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్ష మవుతాడు.వెళ్ళుపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది.ఆ మాటను కుందముడు గట్టిగా నమ్మాడు. వెళ్లి ఆ చింతచెట్టు క్రింద కూచుని తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.అలా కొన్నేళ్ళుగడిచాయి. కుందముడి తండ్రీ,పిన్నీ గతించారు. కొన్నేళ్ళు గడిచాయి. హరి ప్రత్యక్షం కాలేదు కుందమునికి. ఒక రోజు నారదుడు ఆకాశంలో వెడుతూ క్రిందకు చూశాడు. చింత చెట్టు క్రింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే వాడి మీద జాలేసింది క్రిందికి దిగివచ్చాడు. హరి ప్రత్యక్ష మయ్యాడా? అని అడిగాడు. లేదు అన్నాడు కుందముడు.మీరు వైకుంఠా నికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నాసంగతి చెప్పి. ఎప్పుడు ప్రత్యక్ష మవుతాడో కాస్త కనుక్కోండి. అన్నాడు.

నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు.శ్రీదేవితో సరసాలాడుతున్నాడు తున్న శ్రీహరిని చూశాడు.అన్ని లోకాల సంగతులూ చెప్పాడు చివరన భూలోకం సంగతి చెప్తూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు.నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్సనమిస్తావు?ఎన్నాళ్ళీనిరీక్షణ? అని అడిగాడు.అప్పుడేనా?యింకా చాలా ఏళ్ళు తపస్సు చెయ్యాలి వాడు అన్నాడు. చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామీ?ఏ చింతచెట్టుకింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో అన్నేళ్ళు చెయ్యాలి.అన్నాడు శ్రీహరి.నవ్వుతూ.హతోస్మి అనుకుంటూ భూలోకానికి

బయల్దేరాడు.నారదుడిని అల్లంత దూరం లోనే చూసి స్వామీ! శ్రీహరిని కనుక్కున్నారా? ఏమన్నారు ఆయన ? అని ఆత్రుతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లిగా ఆయన ఏమన్నదీ చెప్పాడు. ఆ మాటవిని కుందముడు చాలా విచారిస్తాడనీ,దుఃఖపడతాడనీ అనుకున్నాడు నారదుడు. కానీ వాడు ఆనందముతో గంతులేయ్యడం చూసి ఆశ్చర్యంతో ఈ చెట్టుకు ఎన్ని ఆకులు వున్నాయో అన్నేళ్ళు తపస్సు చెయ్యాలన్నాడు. యిన్నాళ్ళు స్పష్టత లేదు. యిప్పుడు తెలిసింది కదా అని తపస్సు చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు కుందముడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ వుంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. యింకా చాలా ఏళ్ళు తపస్సు చెయ్యాలని చెప్పారు కదా స్వామీ! మరి అప్పుడే ప్రత్యక్షమయ్యారేమి ?అన్నాడు నారదుడు. కుందముడికి నా మీద వున్న భక్తికీ,పట్టుదలకూ కరిగి పోయానయ్యా!అందుకే యిక ఆలస్యం చేయకూడదనుకున్నాను. అందుకే ప్రత్యక్షమయ్యేను అని కుందముడిని అనుగ్రహించాడు.


నీతి: ఏదో జరిగి కలలన్నీ నిజమౌతాయని అనుకోవడం పొరబాటు. అవి నిజం కావడానికి పట్టుదల,వుండాలి కష్టపడి పని చెయ్యాలి. లక్ష్యం చేరుకోవాలంటే చిత్త శుద్ధి, నిజాయితీ, చేసేపనిమీద నిబద్ధత వుండాలి. యివన్నీ వుంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

******

మహానీయుని మాట
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
" ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి "
       - యండమూరి వీరేంద్రనాథ్
     。☆✼★━━━━★✼☆。
 నేటీ మంచి మాట 
     ♡━━━━━ - ━━━━♡
" కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది "
******